ఐపీఎల్ టైటిల్ విన్నర్స్

SMTV Desk 2019-03-15 17:25:13  ipl season title winners, ipl, india

న్యూఢిల్లీ, మార్చ్ 15: ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సందడి మార్చి 23 నుంచి ఐపీఎల్‌ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దిగ్విజయంగా 11 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీగా విరాజిల్లుతోంది. కాగా ఈ సీజన్ లో తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢీకొట్టనుంది. ఇక 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ విజేతలుగా నిలిచిన జట్ల వివరాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్ జట్లు మూడు సార్లు విజేతగా నిలవగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. డక్కన్ ఛార్జర్స్‌ ఒక్కసారి టైటిల్‌ను గెలిచాయి.. ఆ తర్వాత ఈ జట్టు స్థానంలో వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 2016లో విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్), కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాయి.

*2008 ఐపీఎల్ సీజన్ (రాజస్థాన్ రాయల్స్) :
2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో అసాధారణ ఆటతీరుతో చెన్నై సూపర్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 163 పరుగులు చేయగా.. రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

*2009 ఐపీఎల్ సీజన్ (డెక్కన్ ఛార్జర్స్ ) :
2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌, డెక్కన్ ఛార్జర్స్ మధ్య జరిగిన ఆఖరి పోరులో డెక్కన్ ఛార్జర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ జట్టు 143 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 137/9కే పరిమితమైంది.

*2010 ఐపీఎల్ సీజన్ (చెన్నై సూపర్ కింగ్స్‌) :
2010లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు విజేతగా నిలిచింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 168 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి 146/9కే పరిమితమైంది. దీంతో.. 22 పరుగుల తేడాతో ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు టైటిల్ గెలిచింది.

*2011 ఐపీఎల్ సీజన్ (చెన్నై సూపర్ కింగ్స్‌ ) :
2011లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు అలవోక విజయంతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 147/8తోనే సరిపెట్టింది. దీంతో.. 58 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.

*2012 ఐపీఎల్ సీజన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్ ) :
2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగులు చేయగా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించేసింది.

*2013 ఐపీఎల్ సీజన్ (ముంబయి ఇండియన్స్ ) :
2013లో ముంబయి ఇండియన్స్ టీమ్‌ టైటిల్‌ను గెలిచింది. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్‌‌ను 23 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 148 పరుగులు చేయగా.. అనూహ్యంగా చెన్నై 125/9కే పరిమితమైంది.

*2014 ఐపీఎల్ సీజన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్ ) :
2014‌లో మరోసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో భారీ స్కోరు నమోదైన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 199 పరుగులు చేయగా.. మరో 3 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆ లక్ష్యాన్ని ఛేదించేసింది.

*2015 ఐపీఎల్ సీజన్ (ముంబయి ఇండియన్స్ ) :
2015లో మరోసారి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను గెలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 202 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన చెన్నై 161/8కే పరిమితమైంది. దీంతో.. 41 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది.

*2016 ఐపీఎల్ సీజన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) :
2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది. డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో ఐపీఎల్‌లోకి వచ్చిన ఈ జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ చెలరేగడంతో.. మ్యాచ్‌ ఆఖరి వరకూ బెంగళూరు చేతుల్లోనే ఉంది. కానీ.. స్లాగ్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ ఆఖరికి ఆ జట్టుని 200/7కే పరిమితం చేసింది.

*2017 ఐపీఎల్ సీజన్ (ముంబయి ఇండియన్స్ ) :
2017లో ఐపీఎల్‌ టైటిల్‌ను మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా ముంబయి ఇండియన్స్‌ రికార్డుల్లో నిలిచింది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడిన ముంబయి ఇండియన్స్ కేవలం ఒక పరుగు తేడాతో విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 129 పరుగులు చేయగా.. ఛేదనలో పుణె జట్టు 128/6కే పరిమితమైంది.

*2018 ఐపీఎల్ సీజన్ (చెన్నై సూపర్ కింగ్స్ ) :
2018లో రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మూడోసారి విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ అసాధారణ శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో మ్యాచ్‌లో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 178 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చెన్నై కేవలం 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించేసింది