హైదరాబాద్, మార్చ్ 15: ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించే చిట్ట చివరి సినిమా ఏది? అంటే ఇదిగో ఇదే సమాధానం. బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి పేరు ప్రఖ్యాతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. ఆయన సినిమా తీయాలే కానీ జాతీయ స్థాయిలో ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి బాహుబలి 3 తీస్తే అవెంజర్స్ స్టర్ అంతటి వాళ్లు నటిస్తామని అన్నారు. అంటే రాజమౌళి క్రేజు ఇంటర్నేషనల్ లెవల్లో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అంత గొప్ప దర్శకుడు రిటైర్ మెంట్ గురించి మాట్లాడడం అభిమానుల్ని కంగారు పెడుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి కి నేడు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
బాహుబలి సిరీస్ తర్వాత మహాభారతం తీస్తానని మీరు అన్నారు కదా? అని ప్రశ్నిస్తే.. ఆ సినిమాని మొదలు పెడుతున్నానని నేను ఎప్పుడూ అనలేదని రాజమౌళి అన్నారు. నా సినిమా రిలీజైన ప్రతిసారీ మహాభారతం ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే మహాభారతం నా డ్రీమ్ మాత్రమే. అది ఎప్పుడు తీస్తానా? అంటే బహుశా అదే నా చివరి సినిమా అవుతుందేమో అన్నారు. మహాభారతం అనేది ఓ సీరిస్ లాంటిది. అందులో అంతం లేకుండా ఎన్నయినా తీయొచ్చు. అలాంటి ఓ సిరీస్ తో నా కెరీర్ ని ముగిస్తానేమో అని అన్నారు. దీనిని బట్టి ఎస్.ఎస్.రాజమౌళి మైండ్ లో మహాభారతం ఆలోచన చెక్కు చెదరలేదని క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ సినిమాని అతడు సిరీస్ లుగా అంటే అతి భారీ బడ్జెట్ తో ఉండే అవకాశం ఉంది. బహుశా 10-20 సంవత్సరాలు దానికే కేటాయించాల్సిన సన్నివేశం ఉంటుందేమో అన్న సందేహాన్ని రాజమౌళి రేకెత్తించారు. అంత పెద్ద స్పాన్ ఉంటుంది కాబట్టే అదే తన చివరి సినిమా అని లాజిక్ వాడాడన్నమాట. ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రం 2020లో రిలీజైపోతుంది కాబట్టి ఆ వెంటనే మహాభారతం తీస్తాడా? అన్నది చెప్పలేం. మధ్యలో బాహుబలి 3 తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. !!