హైదరాబాద్, మార్చ్ 15: వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన తలకు గాయాలు అవడంతో పాటు, బాత్రూమ్లో రక్తపు మరకలు ఉండడంతో కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు, అనుచరులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా వివేకా మరణం పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. దీంతో వివేకా పార్థివదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.
ఇక తాజాగా కాసేపట్లో వైఎస్ వివేకానందరెడ్డి మరణం పై అనుమానాలు తలెత్తుతున్న నేపధ్యంలో కడప జిల్లా ఎస్పీ స్పందించారు. పోస్టుమార్టం తర్వాత ఏం జరిగిందనేది తేలుతుందన్నారు. బాత్రూమ్లో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. మృతి పై అనుమానాలున్నాయని వైఎస్ వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఐపీసీ 175 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. అలాగే పోస్ట్మార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. మరి వివేకనంద రెడ్డి మృతి పై ఎలాంటి సంచలనాలు బయటపడతాయో చూడాలి.