వాషింగ్టన్, మార్చ్ 15: ‘ జైష్ ఎ మహమ్మద్’ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే చైనా తీరుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ( యూఎన్ఎస్సీ) లో ఇతర సభ్య దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. చైనా ఇదే తీరుగా వ్యవహరిస్తే మసూద్ అజార్ పై ఇతర దేశాలు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాయి. చైనా తీరు దక్షిణాసియాలో ప్రాంతీయ సుస్థిరతకు విఘాతమని అభిప్రాయపడ్డాయి. పుల్వామా ఉగ్రదాడి తరువాత ఫిబ్రవరి 27న అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా యూఎన్ఎస్సీగలో ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు చైనా బుధవారం మోకాలడ్డింది. ప్రతిపాదనను క్షుణ్నంగా పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరింది. వాస్తవానికి అభ్యంతరం వ్యక్తం చేయడానికి బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉంది. సరిగ్గా గంటముందు చైనా మోకాలడ్డింది. దీంతో మరో ఆరు నెలలవరకు దీన్ని యూఎన్ఎస్సీలో ప్రవేశపెట్టడం కుదరదు.