హైదరాబాద్ , మార్చ్ 15: ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్మీట్ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతం ఎప్పుడు తెరకెక్కిస్తారన్న ప్రశ్నకు సమాధానంగా అదే నా చివరి చిత్రం అవ్వచ్చు.. అంటూ సమాధానం ఇచ్చారు. అలియా భట్.. సీతగా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో కనిపించనుందన్నారు. అదే సమయంలో అజయ్ దేవగన్ చేయబోయేది విలన్ పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు.
అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్ పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో వారు ఎక్కడున్నారు, యోధులుగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నట్టుగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను 2020లో విడుదల చేస్తామన్నారు.
చేగువరా జీవత కథ ఆధారంగా తెరకెక్కిన మోటర్ సైకిల్ డైరీస్ సినిమా చూస్తున్నప్పుడు అల్లూరి కథతో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుదన్న ఆలోచన వచ్చిందన్న జక్కన్న తరువాత కొమరం భీమ్ కథ కూడా తెలుసుకున్నాక ఆర్ఆర్ఆర్ ఆలోచన వచ్చిందని తెలిపారు. బాహుబలి తరువాత గ్రాఫిక్స్ అవసరం లేని సినిమా చేయాలనకున్నా కుదరలేదన్నారు. ఈ సినిమాలో కూడా రాజమౌళి మార్క్ క్రియేటివ్ వెపన్స్ చూసే ఛాన్స్ ఉంటుందని అయితే అవి ఏంటన్నది తెర మీదే చూడాలన్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ను వదులుకుంటే 100 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ వచ్చిన మాట నిజమే అన్న దానయ్య రాజమౌళితో సినిమా చేయాలన్న కోరికతోనే ఈ ప్రాజెక్ట్ను విడిచి పెట్టలేదని తెలిపారు. 2019 డిసెంబర్ లేదా 2020 జనవరిలో షూటింగ్ పూర్తవుతుందని తరువాత ఆరు నెలల పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి జూలై 30 న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు.