త్రిస్సూర్, మార్చ్ 14: దేశంలోని మత్స్యకారులందరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ శుభవార్త చెప్పాడు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కేరళలోని త్రిస్సూర్లో జరిగిన అఖిల భారత మత్స్యకారుల మహసభ నిర్వహించిన జాతీయ మత్స్యకార ప్రతినిధుల సమావేశంలో రాహుల్గాంధీ పాల్గొని ప్రసంగించారు. తాను ప్రధాని మోదీలా మోసపూరిత హామీలు ఇవ్వబోనని రాహుల్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుక్షణమే, దేశంలోని మత్స్యకారులందరికీ ఢిల్లీ కేంద్రంగా సొంతంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం…అని ఆయన పేర్కొన్నారు.