న్యూఢిల్లీ, మార్చ్ 14: భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడంలో మోదీ విఫలమమయ్యారని, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కు ప్రధాని మోదీ భయపడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే ఇష్యూలో ట్విటర్ వేదికగా మోదీపై పలు విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. జిన్ పింగ్ తో కలిసి పర్యటించే మోడీ.. ఆయన ముందు తలవొంచుతారని ఘాటుగా ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్లకు భాజపా స్పందించి.. ‘చైనాకు ఆ అధికారం మీ ముత్తాత’ వల్లే వచ్చిందిగా అంటూ కౌంటర్ ఇచ్చింది. ‘‘భారత్ను పక్కనబెట్టి మీ ముత్తాత చైనాకు అధికారాన్ని బహుమతి ఇవ్వకుంటే ఇప్పుడు ఐరాస భద్రతామండలిలో ఆ దేశం ఉండేది కాదంటూ విమర్శించింది. మీ కుటుంబం చేసిన తప్పులను ఇప్పుడు భారత్ సరిదిద్దుకుంటూ వస్తోందనీ.. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే ఈ పోరాటంలోనూ భారత్ తప్పకుండా విజయం సాధిస్తుందని బీజేపీ హామీ ఇచ్చింది.