కేటీఆర్‌ మాటలని తిప్పికొట్టిన దత్తాత్రేయ

SMTV Desk 2019-03-14 09:36:28  ktr, dathatreya,

హైదరాబాద్, మార్చ్ 13: బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ ఇవాళ్ళ తన మనసులో మాట బయటపెట్టేశారు. తాను మళ్ళీ సికిందరాబాద్‌ నుంచి పోటీ చేయాలనుకొంటున్నానని చెప్పారు. అయితే పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బాధపడనని చెప్పారు. ఒకవేళ వేరెవరికైనా సికిందరాబాద్‌ నియోజకవర్గాన్ని కేటాయించదలిస్తే తాను తప్పకుండా ఆ అభ్యర్ధికి పూర్తి సహాయసహకారాలు అందజేసి గెలిపించుకొంటానని చెప్పారు. తెరాసకు 16 సీట్లు వస్తే కేంద్రం మెడలు వంచుతామని కేటీఆర్‌ చెపుతున్న మాటలను బండారు తప్పు పట్టారు. నిజంగా తెరాస 16 సీట్లు గెలుచుకొన్నా చేయగలిగిందేమీ ఉండబోదని ఎందుకంటే ఈసారి బిజెపి 300 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపడతారని అన్నారు. కేవలం నరేంద్రమోడీ మాత్రమే దేశసమస్యలన్నిటినీ పరిష్కరించి మళ్ళీ గాడిన పెట్టగలుగుతున్నారని యావత్ దేశప్రజలు నమ్ముతున్నారని కనుక లోక్‌సభ ఎన్నికలలో బిజెపివైపే మొగ్గు చూపుతారని బండారు దత్తాత్రేయ అన్నారు.