హైదరాబాద్, మార్చ్ 13: టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ కేవలం నాగార్జునకు మాత్రమే కాదు.. సినీ-రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు పీఎం ఆఫీస్ నుండి వచ్చిందని తెలుస్తోంది.
ఇంతకీ ఆయన నాగార్జునకు మోదీ ఏమని ట్వీట్ చేశారంటే.. కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. అవార్డులు సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని కోరుతున్నాను అంటూ మోదీ తన ట్వీట్ లో నాగార్జునను అభ్యర్ధించడం ఆసక్తి కలిగిస్తోంది.
మోహన్లాల్, నాగార్జున , షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, క్రీడా ప్రముఖులు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, క్రికెటర్లు ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఫోగట్ సోదరీమణులు గీతా, బబిత, విన్నేశ్, బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొణె, ఆలియా భట్, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్, సల్మాన్ఖాన్, ఆమీర్ఖాన్, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులను మోడి అభ్యర్థించారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ప్రజల ఆలోచనలపై మీడియా పెను ప్రభావం చూపుతోందని, అలాంటి మీడియా సంస్థలు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం కల్పించాలని మోడి విజ్ఞప్తి చేశారు.