మార్చ్ 13: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను నేడు భారత్ లో ప్రారంభించింది. దీనికి సంబంధించిన సేవలపై గతేడాది మే నెలలోనే రావాల్సి ఉండగా ఎట్టకేలకు నేడు అందుబాటులోకి వచ్చాయి. ఐతే యూట్యూబ్ మ్యూజిక్ ఫ్రీ, ప్రీమియం ఆప్షన్లలో వినియోగదారులకు లభిస్తున్నది. ఫ్రీ సర్వీస్లో ఐతే యాప్లో యాడ్స్ వస్తాయి. కానీ ప్రీమియం సర్వీస్లో యాడ్స్ రావు. ఐతే అందుకు గాను యూజర్లు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే లాంచింగ్ సందర్బంగా 3నెలల పాటు యూట్యూబ్ ఉచితంగా సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నారు. ఆ తరువాత నెలకు రూ.99 చెల్లించాలి. లేదా రూ. 149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 5 మంది కుటుంబ సభ్యులు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను పొందవచ్చు. ఆ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై యూజర్లకు లభిస్తున్నది.