హైదరాబాద్, మార్చ్ 13: ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు రాజకీయాల వేడి.. మరోవైపు ఎన్టీఆర్ సినిమాల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రాజకీయ వర్గాల్లో కేక పుట్టిస్తోంది. తాజాగా మరో చిత్రం కూడా చర్చనీయాంశంగా మారింది. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో లక్ష్మీ పార్వతి పాత్రధారి ఎన్టీఆర్ ఇంట్లోకి అడుగు పెడుతుండగా, గద్దలు ఎగిరినట్టు, ఉరుములు, మెరుపులు చూపించారు. ‘తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం’ అనే క్యాప్షన్తో వచ్చింది ఈ టీజర్.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దానిని ఈ సినిమాలో చూపించనున్నట్టు టీజర్ని బట్టి అర్ధమవుతోంది.ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా శ్రీ రెడ్డి నటిస్తున్నారు. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన సంఘటలకు దృశ్యరూపం మా సినిమా. ఎన్టీఆర్ తుది దశలో ఎదుర్కున్న అత్యంత అవమానకరమైన, కీలకమైన సన్నివేశాలను జనరంజకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఎవరినీ ఉదేశించి తీయడంలేదు’ అని తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ టీజర్ వర్మ విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టీజర్ మాదిరే వుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.