అమరావతి, మార్చ్ 13: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపధ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వలసలు జోరు ఊపందుకుంది. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసీపీ- టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల్లోనే టిక్కెట్ల విషయంలో భంగపడ్డ వారు మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు.
ఇక ఈ జంపింగ్లు అధికార తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువగా ఉన్నాయి. వైసీపీలో మాత్రం చేరికలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు వైసీపీలోకి క్యూలు కడుతున్నారు. ఇక తాజాగా సినీ పరిశ్రమ నుండి సినీ నటుడు అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజా మ్యాటర్ ఏంటంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో, రాజా రవీంద్ర భేటీ కానున్నారని తెలుస్తోంది. రాజా రవీంద్ర చేరిక దాదాపు ఖాయమని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇక ఈరోజు వైసీపీలో మరికొంత మంత్రి చేరనున్నారని సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల వేళ వైసీపీ టాప్ గేర్లో దూసుకుపోతుందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.