అమరావతి, మార్చ్ 13: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వార్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నాయి. ఇక కొద్దిరోజుల ముందు ఓట్ల గల్లంతు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సర్వేల పేరుతో వైసీపీ వర్గాల ఓట్లన్నీ టీడీపీ గ్యాంగ్ లేపేస్తుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా ఫిర్యాదులు చేయడంతో, ఏకంగా డేటా చోరీ కేసు తెరపైకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి ఓటు తొలగించాలంటే ఫారం-7 దాఖలవడం రాజకీయవర్గాల్లో మరో రచ్చకు తెరలేపింది. తాజాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి, జగన్ ఓటు తొలగించమంటూ వచ్చిన దరఖాస్తు ఇప్పుడు సంచలనం సృస్టిస్తోంది. దీంతో వెంటనే జగన్ బంధువులు పులివెందుల తహసిల్దార్కు ఫిర్యాదు చేయడంతో, విచారణకు దిగారని తెలుస్తోంది. అలాగే పులివెందుల పోలీస్ స్టేషన్లో కూడా దీని పై కేసీ నమోదు చేశారని సమాచారం. దీంతో ఇప్పటికే ఫారం -7 పేరుతో లక్షల ఓట్ల గల్లంతు వ్యవహారంలో టీడీపీ- వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తుకుంటున్న నేపధ్యంలో, ఇప్పుడు ఏకంగా జగన్ ఓటుకే ఎసరు పెట్టడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.