అమరావతి, మార్చ్ 12: ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...పృధ్వీరాజ్, కృష్ణుడు, జయసుధ, అలీ...తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు వైకాపాకు క్యూ కడుతున్నారు. ఆ జాబితాలో ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పేరు కూడా చేరింది. వరప్రసాద్( పీవీపీ) రేపు పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అంతేకాక విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పీవీపి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి. కాగా ఈ నెల 23న ఆయన నామినేషన్ వేస్తారని ప్రచారం జరుగుతోంది. పీవీపీ గత ఎన్నికల్లోనే వైఎస్ఆర్సిపి తరపున విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైకాపా అధిష్ఠానం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.