మార్చ్ 12: పట్టణాల్లో ఇంటి అద్దెలు భగ్గుమంటున్నాయి. సొంత ఊరు నుండి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇక నగరాల్లో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. నెలకు సగటున రూ.16,000 వరకు చెల్లించేందుకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా నెలకు సగటున రూ.11,000 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ‘మకాన్.కామ్’ అనే రియల్టీ పోర్టల్ ఈ విషయాలు వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్ల కోసం చూస్తున్న వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారిలో దాదాపు 69 శాతం మంది ఉద్యోగులు, 16 శాతం మంది స్వయం ఉపాధి రంగంలోని వారు, 15 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగుల్లో 40 శాతం మంది నెలకు రూ.10,000 లేదా అంత కన్నా తక్కువ అద్దె ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారు. మరో 40 శాతం మంది మాత్రం తమకు తగ్గ ఇల్లు దొరికితే రూ.10,000 నుంచి రూ.25,000 వరకు అద్దె చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అద్దె ఇంటి కోసం చూస్తున్నవారు తొలిగా ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. తర్వాత ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు.