టీఆర్ఎస్ పదహారు స్థానాల్లో విజయం

SMTV Desk 2019-03-12 09:34:54  TRS, KCR,

హైదరాబాద్, మార్చ్ 12: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పదహారు స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ గెలుపును స్పష్టంగా చెప్తున్నాయన్న సీఎం… ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు లక్షల మెజార్టీ సాధనే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రధాన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలే తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు పార్లమెంటు ఎన్నికలపై పార్టీ నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనారోగ్య కారణాలతో పద్మారావు, సాయన్న ఈ సమావేశానికి హాజరుకాలేదు. రెడ్యానాయక్ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని రావడంతో ఆలస్యమైంది. అప్పటికే సమావేశం పూర్తయినా ఆయనతోనూ మాక్ పోలింగ్ నిర్వహించారు.