భువనగిరి, మార్చ్ 11: గ్యాంగ్స్టర్ నయూం చనిపోయిన తరువాత కూడా అతని అనుచరులు దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నయూం అనుచరుల్లో ముగ్గురిని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అరెస్ట్ చేశారు. నయీం భార్య హసీనా బేగం, గతంలో నయీం అనుచరుడుగా ఉన్న పాశం శ్రీనివాస్, మున్సిఫల్ కౌన్సిలర్ అబ్దుల్ నజీర్తో పాటు నయీం సమీప బంధువు ఫహీమ్ను కూడ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి రూ.88.37 లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. భువనగిరి సమీపంలోని నయీంకు చెందిన భూమి తుమ్మ శ్రీనివాస్ పేరున రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిని విక్రయించాలని ఈ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు వెంకటేశ్వరరావు ముందుకు వచ్చాడు. ఈ భూమిని రూ.89 లక్షలకు ఐదు ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 8వ తేదీన భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో రిజిస్ట్రేషన్ను నిలిపివేసినట్టు రాచకొండ సీపీ తెలిపారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐ వెంకన్నలను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు చెప్పారు.