ముంబై, మార్చ్ 11: తాజాగా ఆర్బీఐ విధించిన ఆంక్షల నుండి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఐడీబీఐ బ్యాంక్. ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ బ్యాంక్ కు చెందిన రూ.10వేల కోట్ల విలువైన నిరర్ధక ఆస్తులను విక్రయించడానికి సిద్దమయ్యింది. అంతేకాక మొండిబకాయిల వసూలుకు ఒక వార్ రూమ్ను కూడా ప్రారంభించారని బ్యాంక్ సీఈవో రాకేష్ శర్మ స్వయంగా వెల్లడించారు. ఇటీవలే ఎల్ఐసీ ఐడీబీఐలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అప్పటికే ఐడీబీఐపై ఆర్బీఐ పీసీఏ ఆంక్షలు ఉన్నాయి. దీంతో బ్యాంక్ను పీసీఏ నుంచి గట్టెక్కించడానికి ఎల్ఐసీ దాదాపు రూ.21వేల కోట్లను ఐడీబీఐలో పెట్టుబడిగా తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా చేపట్టిన రూ.10వేల కోట్ల నిరర్ధక ఆస్తుల వేలం కూడా పూర్తి అయితే మొండిబకాయిలు తగ్గుముఖం పట్టి లాభాలు పెరుగుతాయి. దీంతోపాటు ఎన్ఎస్ఈ, ఎన్ఎస్డీలో ఐడీబీఐకు ఉన్న రూ.10వేల కోట్లు విలువైన వాటాలను కూడా వచ్చేనెల విక్రయించే అవకాశం ఉంది.