హిమాచల్ ప్రదేశ్, ఆగష్ట్ 7: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ నాయకులు వివిధ హామీలు ఇవ్వడం, మిగతా పార్టీలపై సవాల్ విసరడం, ఎద్దేవా చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వారికి కొత్త ఏమి కాదు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 2017 చివరలో హిమాచల్ ప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో భాజపా 60 సీట్లు గెలిస్తే తాను రాష్ట్రం నుంచి వెళ్లిపోతానంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ సవాల్ విసిరారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. ఈ తరుణంలో భాజపా ‘మిషన్ 60 ప్లస్’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారు, పదవుల కోసం కాదు అని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో వీరభద్ర సింగ్ మాట్లాడుతూ... భాజపా నిరంకుశత్వాన్ని విశ్వసించే పార్టీ అని ఆరోపించారు.