చంచల్గూడ, మార్చ్ 11: తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల కోసం ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. బయటి ప్రపంచంలో వాళ్లు కోల్పోయిన వాటిని జైలులో అందించే క్రమంలో జైలులో ఎఫ్ఎం రేడియో సేవలు అందించనున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో ఖైదీలు ఎఫ్ఎం రేడియోను విననున్నారు. ఇది జైలు రేడియో గురూ అంటూ అందించే సమాచారాన్ని పొందనున్నారు. ఈ క్రమంలో ఆదివారం తొలుత చంచల్గూడ జైలులో ఎఫ్ఎం రేడియోను ప్రారంభించింది. జైళ్ల పర్యవేక్షణాధికారి అర్జున్రావు మాట్లాడుతూ.. ‘ఖైదీలకు కావాల్సిన పెరోల్, ఫర్లో, ములాఖత్ విషయాలతో పాటు, వారికి జైలు అధికారులు అందించే రెమిషన్ లాంటి అదనపు సమాచారాన్ని అందించేందుకు ఈ రేడియోను వినియోగించే అవకాశాలున్నాయి. ఖైదీలు వారుండే బ్యారక్లలోనే రేడియో వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి వినోదంతో పాటు ఖైదీలకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.