న్యూఢిల్లీ, మార్చ్ 11: జిఎస్టి విలువైన కార్లు, నగలు కొనుగోలు దారులకు ఊరట నిచ్చింది. జిఎస్టి లెక్కింపు కోసం వస్తువుల విలువ నుండి టిసిఎస్(ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) తాజాగా మినహాయింపు ఇచ్చింది. అయితే ఇకపై ఎక్కువ విలువ కల్గిన వాహనాల కొనుగోళ్ల సమయంలో విధించే 1శాతం టిసిఎస్ను వస్తువుల విలువలో కలపటం లేదని సిబిఐసి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్) వెల్లడించింది. దీంతో రూ.10 లక్షలు, రూ.5 లక్షలకు పైన విలువ కల్గిన కార్లు, రూ.2 లక్షలకు పైన విలువకల్గిన పసిడి కొనుగోళ్లపై ఉపశమనం లభించనుంది. జిఎస్టి కంప్యూటింగ్ చేసేటప్పుడు టిసిఎస్ విలువను మినహాయించాలని సిబిఐసి పేర్కొంది. అయితే ఖరీదైన వస్తువులపై జిఎస్టి లెక్కగట్టే సమయంలోనే టిసిఎస్ను కూడా కలిపి లెక్కగట్టాలనే సిబిఐసి ఆదేశాలపై వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు వచ్చాయి.