న్యూఢిల్లీ, మార్చ్ 11: సార్వత్రిక ఎన్నికల తేదీని ఆదివారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే క్రమంలో ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. మార్చ్ 10 నుండి మే 23 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(MCC) లోని నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో వున్న అంశాలివే..
*ఎన్నికల జరుగుతున్న సమయం కావడంతో ప్రభుత్వ సంస్థలు ఎటువంటి నియామకాలు చేపట్టకూడదు.
*ఓటర్లను అభ్యర్థులు మద్యంతో ప్రలోభ పెట్టడం నిషేదం.
*పోలింగ్ రోజున అభ్యర్థులు బూత్ల దగ్గర పోల్ డ్యూటీ అధికారులకు పూర్తిగా సహకరించాలి.
*ప్రత్యర్థులు ఒకరినొకరు గౌరవించాలి. వారి ఇంటిముందు, కవ్వించే ప్రదర్శనలు, చర్యలు చేయొద్దు.
*అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మంత్రులు ఎటువంటి అడ్హాక్ నియామకాలు చేపట్టవద్దు.
*ఎన్నికల ప్రచార ర్యాలీలు , రోడ్ షోలు సాధారణ రోడ్ ట్రాఫిక్ను ఇబ్బందిపెట్టేలా నిర్వహించకూడదు.
*ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రోడ్డు నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు ప్రారంభించకూడదు.
*ప్రచారం కోసం మైకులు వాడాలనుకుంటే అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిర్ణీత సమయంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించాలి.
*ఎన్నికల పరిశీలకులకు ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చు.
*ప్రచార సభలకు మైదానాలు, హెలిప్యాడ్లు, ప్రభుత్వ గెస్ట్ హౌజ్లు, బిల్డింగులను ఉపయోగించడంలో అందరు పోటీదారులు సమానమే. ఇందులో ఎక్కువ తక్కువలు ఉండవు.
*ప్రచారం కోసం అధికార పార్టీ తన అధికారాన్ని వినియోగించకూడదు.
*పోల్ బూత్ల వద్ద, చుట్టుపక్కల అభ్యర్థులు వారి గుర్తులు, పార్టీ గుర్తులను ప్రదర్శించకూడదు.