ఇస్లామాబాద్, మార్చ్ 10: భారత్ పై మరోసారి పాక్ సర్కార్ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఆసియా-పసిఫిక్ జాయింట్ గ్రూప్ (ఎఫ్ఏటీఎఫ్) కో ఛైర్గా ఉన్న భారత్ స్థానంలో వేరే దేశాన్ని నియమించాలని పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీక్ష నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఈ అభ్యర్థనను ఎఫ్ఏటీఎఫ్ ముందుంచుతున్నాం అని లేఖలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ పేర్కొన్నారు. ‘పాక్పై భారత్ వైఖరి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. పాక్ పట్ల భారత్ ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తుందని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఫిబ్రవరి 18న జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్థాన్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలని భారత్ కోరింది. సమీక్ష విభాగంలో భారత్ వుంటే ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలన్న స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశం ఉంది’ అంటూ లేఖలో పేర్కొన్నారు ఆర్థికమంత్రి ఉమర్. ఎఫ్ఏటీఎఫ్ విభాగమైన ఇంటర్నేషనల్ కోఆపరేషన్ రివ్యూ గ్రూప్(ఐసీఆర్జీ)లో ఆసియా-పసిఫిక్ జాయింట్ గ్రూప్ ఓ భాగం. ఆసియా-పసిఫిక్ గ్రూప్లోని సభ్యదేశాల సమీక్షలు జరిపే బాధ్యత దీనిపై ఉంటుంది. దీనికి భారత ఫైనాన్షియల్ డైరెక్టర్ జనరల్ కోఛైర్గా వ్యవహరిస్తున్నారు