గాంధీ నగర్, మార్చ్ 10: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ సందర్భంగా కొత్తగా ముగ్గురు సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే జవహర్ చావ్డాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అంతేకాక వడోదరా జిల్లాలోని మాంజల్ పూర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్, జామ్ నగర్ పశ్చిమ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ జడేజాలను కేబినేట్ లోకి తీసుకున్నారు. గుజరాత్ గవర్నర్ ఓ పీ కోహ్లీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా రాజ్ భవన్ లోపల నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కొందరు ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. మంత్రివర్గ విస్తరణతో గుజరాత్ మంత్రిమండలి సంఖ్య 24కు చేరింది.