న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల తేదిని ఎన్నికల సంఘం ఎప్పుడెప్పుడు ప్రకటిస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఈరోజు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ గురించి చర్చించేందుకు సిద్దమయ్యారు. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ మేరకు నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహిస్తుండడంతో ఎన్నికల ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు. తొమ్మిది లేదా 10 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేశారు.