మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తు

SMTV Desk 2019-03-10 12:06:22  Kamal Haasan, Makkal Nidi Mayyam, Torch Light Symbol, Lok Sabha Polls

చెన్నై, మార్చి 10: ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించాడు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా పాల్గొనబోతున్నారు కమల్‌హాసన్‌. అయితే ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

"మా పార్టీకి తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యం టార్చ్ బేరర్‌గా మారబోతోంది. మాకు టార్చ్‌లైట్ గుర్తును కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.

కమల్ గతేడాది ఫిబ్రవరి 21న పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరితోనూ పొత్తు ఉండదని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని, అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నామని కమల్ తెలిపారు. డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు కమలహాసన్.