హైదరాబాద్, మార్చి 10: నిన్న(శనివారం) సాయంత్రం శంషాబాద్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్యర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ నాయకురాలు రాములమ్మ ప్రస్సంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల జల్లు కురిపించారు. మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యావత్ భారత్ ప్రధానిని చూసి భయపడుతున్నారని అన్నారు. ఏ క్షణంలో, ఎక్కడ బాంబు వేస్తారో అనే భయంతో వణికిపోతున్నారని చెప్పారు. ప్రజలను ప్రేమించడం మానేసి, వారిని భయపెడుతున్నారని విమర్శించారు. మోదీ ఒక ఉగ్రవాదిలా కనిపిస్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ మధ్యేనని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ కృషి చేస్తున్నారని, ఇదే సమయంలో మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరో ఐదేళ్ల పాటు దేశాన్ని నియంతలా శాసించాలనేది మోదీ కోరిక అంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి సమయంలో ప్రజలు ఆయనకు మరో అవకాశం ఇవ్వబోరని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ, నల్లధనం, పుల్వామా దాడి లాంటి అంశాలతో ప్రజలను మోదీ భయపెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని చెప్పారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపుకు మోదీ సహకరించారని అన్నారు.