అవును తెరాసలో చేరుతున్నాను

SMTV Desk 2019-03-10 09:49:57  chirumarti, trs,

హైదరాబాద్, మార్చ్ 10: నకిరేకల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరబోతున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను శనివారం ఆయన స్వయంగా దృవీకరించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు నల్గొండలో ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాస టికెట్ పై మళ్ళీ పోటీ చేసి గెలవగలనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినప్పటికీ పార్టీ నేతల వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. కేవలం కేసీఆర్‌ వల్లే నల్గొండ జిల్లా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు. త్వరలోనే తెరాసలో చేరుతానని ఆ విషయం మీడియాకు ముందే తెలియజేస్తానని చిరుమర్తి లింగయ్య చెప్పారు.

ఆయన ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌తో సమావేశమైన తరువాత నుంచి కాంగ్రెస్‌ నేతలకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నప్పుడే, ఆయన పార్టీని వీడబోతున్నారనే విషయం స్పష్టం అయ్యింది. ఈరోజు ఆయనే పార్టీ ఫిరాయిస్తున్నట్లు స్వయంగా ప్రకటించి ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఆయనను కుటుంబ సభ్యుడిగా చూసుకోంటూ అసెంబ్లీ ఎన్నికలలో పట్టుబట్టి టికెట్ ఇప్పించిన కోమటిరెడ్డి సోదరులకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.