శ్రీనగర్, మార్చి 9: కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ మొహమ్మద్ యాసిన్ భట్ ను కొందరు ఉగ్రవాద కిరాతకులు నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం కూడా అందించారు. అయితే ఈ తెల్లవారుజామున అతని జాడ తెలిసింది. తెల్లారి పొగమంచు వేళలో కొందరు ఆటగాళ్ళకు గాయాలతో ఉన్న అతను కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పుల్వామా ఉగ్ర దాడి తర్వాత కేంద్రం జమ్మూకాశ్మీర్లో పెద్ద ఎత్తున ఆర్మీని మోహరించింది. అయినప్పటికీ ఉగ్రవాదులు ఏదోవిధంగా చొరబడుతునే ఉన్నారు. 2018 జూన్లో ఆర్మీ సైనికుడు ఔరంగజేబును, దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు. అతన్ని బుల్లెట్లతో కిరాతకంగా చంపారు. అలాగే 2017 లో కూడా ఇలాగే 22 ఏళ్ల లెఫ్టినెంట్ ఉమ్మర్ ఫయాజ్ తన చెల్లి పెళ్లి కోసం సెలవు తీసుకొని ఇంటికి రాగా మిలిటెంట్లు పట్టుకుపోయి, ఉరి తీశారు.
అయితే ఇదే తరహాలో యాసిన్ భట్ను కూడా ఉగ్రవాదులు చంపేస్తారేమోనన్న ఆందోళన కలిగింది. ఉగ్రవాదులు యాసిన్ ను చంపి వుంటే ఆ విషయాన్నీ కేంద్రం మరింత సీరియస్గా తీసుకొని, ఉగ్ర మూకలపై చెలరేగిపోయే ప్రమాదం ఉండటం వల్లే అతన్ని చంపలేదని సమాచారం.