గాంధీనగర్, మార్చి 9: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గుజరాత్ లో కాంగ్రెస్ కు చెందినా ఇద్దరు నాయకులూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు అధికార బీజేపీ కండువా కప్పుకోగా మరొకరు కూడా అదే దారిలో నడవనున్నట్లు సమాచారం. మనవదార్ ఎమ్మెల్యే జవహర్ చవ్డా తన రాజీనామా లేఖను శుక్రవారం మధ్యాహ్నం స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి అందించారు. ధ్రంగధర కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్షోతమ్ సబారియా కూడా సాయంత్రం పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే గాంధీనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చవ్డా. తాను కూడా కమలం పార్టీలో చేరబోతున్నట్టు సబారియా ప్రకటించారు. ఇరిగేషన్ కుంభకోణం కేసులో సబారియా గతేడాది అక్టోబరులో అరెస్టయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిలుపై విడుదలయ్యారు. బీజేపీలో చేరిక వెనక తనపై ఎటువంటి ఒత్తిడి లేదని, పెండింగ్ కేసుకు బీజేపీలో చేరికకు సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. స్వచ్ఛందంగానే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీ తనకు మంత్రి పదవి ఆఫర్ చేయలేదని స్పష్టం చేశారు.