తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

SMTV Desk 2017-08-06 17:28:25  chennai, car accedent, rash driving,

చెన్నై, ఆగస్ట్ 6 : తమిళనాడు లో రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూడు కార్లు ఢీకొని ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...వేలూరు జిల్లా, రత్నగిరి దగ్గర మూడు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ముందు వెళ్తున్న ఓ యువకుడు బైక్ మీద స్టంట్లు చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసినందువల్లే, ఆ బైక్ ని తప్పించబోయి వెనుక వస్తున్న కారు సడన్ బ్రేక్ కొట్టేసరికి ఆ వెనుక ఉన్న రెండు కార్లు ఢీకొనడం జరిగిందంటున్నారు స్థానికులు. అయితే, క్షతగాత్రులలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నట్లు సమాచారం. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రమాదం జరిగిన కార్లను ప్రోక్లైనర్ తో తొలగించారు. ఆ మూడు కార్లు కూడా నుజ్జు నుజ్జయిపోయినట్లు తెలుస్తుంది. అయితే, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు...ఆ వాహనాలను కర్ణాటకకు చెందినవిగా గుర్తించి, కర్ణాటక నుండి చెన్నై వస్తుండగా ఈ దారుణం సంభవించినట్లు అభిప్రాయపడ్డారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.