ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓట్ల గల్లంతు కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీడియా ఈ వార్తలను బాగా హైలెట్ చేస్తుండటంతో ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు కొమ్ముకాస్తున్నాయంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీవీ5 ఛానల్పై ప్రతిపక్ష పార్టీ వైసీపీ నిషేధం విధించింది. ఈ క్రమంలో వైసీపీ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తెలుగుదేశం పార్టీని భుజానమోసే స్థితినుంచి నెత్తికెక్కించుకుని వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేస్తున్న టీవీ-5 ఛానల్ చర్చలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ ఒక్కరూ పాల్గొనరాదని పార్టీ నాయకులందరినీ ఆదేశించడమైనది. మా పార్టీవారిని చర్చలకు ఆహ్వానించవద్దని టీవీ-5కు కూడా స్పష్టం చేస్తున్నాం. అలాగే, మొత్తంగా పార్టీ ప్రెస్ మీట్లు, కార్యక్రమాల కవరేజిలో టీవీ-5ను నిషేదించడమైనది. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఏబీఎన్ ను నిషేధిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అని తెలిపింది.