రాంచీ: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. భారత జట్టు ముందు ఆసీస్ 314 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఖవాజా సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్లు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫించ్ 99 బంతుల్లో 93 పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఫించ్, మ్యాక్స్వెల్ చెరో మూడు సిక్స్లు కొట్టగా ఖవాజా ఒక సిక్స్ బాదాడు. ఖవాజా 104 పరుగులు చేసి షమీ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాక్స్వెల్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. మార్ష్ 7 పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్లో విజయ్ శంకర్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. కులదీప్ యాదవ్ బౌలింగ్లో హ్యాండ్స్కోంబ్ (0) ఎల్బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. స్టయినీస్ (31), కారే(21) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా షమీ ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే భారత్ రెండు వన్డేలు గెలిచి 2-0 ఆధిక్యంలో ఉంది.