డేటా చోరీ కేసుపై నటుడు శివాజీ కామెంట్స్

SMTV Desk 2019-03-08 17:52:55  data scam case, actor shivaji, trs kcr, chandrababu, tdp, ap government, telangana government

విజయవాడ, మార్చ్ 08: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసులో నటుడు శివాజీ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడలోని మీడియాతో మాట్లాడిన అయన డేటా చోరీ వ్యవహారం ఏదో అంతర్జాతీయ సమస్యలా, భారతదేశంలో తొలిసారిగా జరిగినట్లు రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఓట్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు ఫోన్ చేసి వివరాలు సేకరించారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఉన్న ఓట్లవివరాలపై ఎన్నికల ప్రధాన అధికారికి కేసీఆర్ ఫోన్ చేశారని, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో 40 లక్షల మంది సెటిలర్స్ ఉన్నారని తెలిపారు. ఈసికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒప్పందంతోనే ఆధార్ నంబర్ లింక్ చేశారంటూ ఆరోపించారు హీరో శివాజీ. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేశారంటూ ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆధారంగా చేసుకుని ఓట్లు తొలగించారన్నారు. ఓట్లు తొలగించాలంటే ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి కాబట్టే సమగ్ర కుటుంబ సర్వే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా బేస్ ను ఆధారంగా చేసుకుని ఓట్లు తొలగించే కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఫామ్ ప్రైవేట్ కంపెనీ డిజైన్ చెయ్యడమే అందుకు నాంది పలకడం జరిగిందని ఆరోపించారు. ఆ ప్రైవేట్ కంపెనీకి డేటా అంతా అందజేసి ఓట్ల కుంభకోణానికి పాల్పడింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అంటూ శివాజీ ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలను కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. ఐటీ గ్రిడ్ అనేది ప్రజల డేటా చోర్యం చెయ్యాలి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కేంద్రంగా చేసుకుంటారని ప్రశ్నించారు.