అమరావతి, మార్చ్ 08: డేటా చోరీ కేసులో ఏపి సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్, తన పనిలో భాగంగా సిట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ, డిజిపి ఠాకూర్ను ఈ రోజు కలిశారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు, విచారణ తీరుపై డిజిపితో చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొందరు వ్యక్తులు ఆన్లైన్లో పెద్దఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేశారు. ఈ నేపథ్యంలో పది రోజుల్లో 8.74 లక్షల దరఖాస్తులు ఈసికి అందాయి. వీటిలో అత్యధిక శాతం నకిలీవేనని గుర్తించారు. అయితే మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం తరఫున తహసీల్దార్లు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 కేసులు పెట్టారు. కాగా వీటిలో 232 కేసులకు సంబంధించి 2300 మంది దరఖాస్తుదారులను కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసు విస్తృతి, ఐపి చిరునామాలు తీసుకుని నిందితులను పట్టుకోవడం, ఇతర రాష్ట్రాల్లోని ఐపి చిరునామాల నుంచి దరఖాస్తులు అందడం వంటి సంక్షిష్టతల నేపథ్యంలో ఈ మొత్తం కేసుల దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.