రాంచీ, మార్చ్ 08: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీసీ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు రాంచీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఎడుల్జీ టాస్ కాయిన్ తీసుకువచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ కాయిన్ను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళా దినోత్సవం సందర్భంగా ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇండియన్ క్రికెట్కు ధన్యవాదాలు. మహిళా క్రికెట్కు మరింత ఊతమివ్వడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు మున్ముందు క్రికెట్ రంగాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మన మహిళా జట్టు కూడా ఇటీవలి కాలంలో బాగా రాణిస్తోంది. దేశంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎడుల్జీ తెలిపారు.