హైదరాబాద్, మార్చి 08: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందంటే ఏ కథానాయికైన ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించే అవకాశం వచ్చినా..క్యారెక్టర్ నచ్చక ఈ ఆఫర్ను తిరస్కరించినట్టు సమాచారం.
ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉండాల్సింది. కానీ వీళ్లిద్దరి మధ్య కథ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో మహేష్ బాబు..... ఎఫ్ 2 మూవీతో వరుసగా నాలుగు సక్సెస్లు అందుకున్న అనిల్ రావిపూడితో పుల్ టైం కామెడీ ఎంటర్టేనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను దూకుడు సినిమాకు సీక్వెల్గా తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉన్నారట!
ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి, రష్మిక మందన్నలు అనుకున్నారు. కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసేందకు సాయి పల్లవి నో చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సాయి పల్లవి కథ నచ్చితేనే ఏ సినిమానైనా యాక్సెప్ట్ చేస్తోంది.
స్టార్ డమ్, కాంబినేషన్ చూసి సినిమా ఒప్పుకునే రకం కాదు. ఆమెకు సినిమాలో పాత్ర నచ్చితేనే ఓకే చెబుతుంది. రీసెంట్గా ఆమె ముఖ్యపాత్రలో నటించిన పడి పడి లేచే మనసు , మారి 2 అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయాయి. తాజాగా అనిల్ రావిపూడితో మహేష్ బాబు చేస్తోన్న కథలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినా... కథలో పాత్ర నచ్చక సాయి పల్లవి నో చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.