ముంబై, మార్చి 8: ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు తీవ్ర నష్టం మిగిల్చాడు. అలా బ్యాంకుకు అప్పు తీర్చకుండా వెళ్లి విదేశాల్లో తలదాచుకున్నాడు. కాగా, ఆయన ఎంతో ఇష్టంగా, 33 వేల చదరపు అడుగుల స్థలంలో కట్టుకున్న అలీబాగ్లోని బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు నేలమట్టం చేశారు. మాములుగా అయితే అక్రమ నిర్మాణాల్ని, కట్టడాల్ని బుల్డోజర్లతో అధికారులు తొలగిస్తుంటారు. కానీ నీరవ్ మోదీ బంగ్లా కూల్చేందుకు మాత్రం అధికారులు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను పడగొట్టారు. బంగ్లా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గదులను బుల్డోజర్లతో నేలమట్టం చేసిన అధికారులు, భవనానికి రంధ్రాలు చేసి డైనమైట్ అమర్చి పేల్చేశారు. రిమోట్ కంట్రోల్ సాయంతో దీన్ని ఆపరేట్ చేశారు. బంగ్లానే కాకుండా బంగ్లా చుట్టూ ఉన్న తోటను కూడా ద్వంసం చేశారు.