రాబోయే ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టుకోమని, వామపక్ష పార్టీలతో మాత్రమే కలిసి వెళతామని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికి
పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సీట్ల సర్దుబాటు. పొత్తులపై జనసేనాని దృష్టిసారించారు. ఇందులో భాగంగా వామపక్ష పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వామపక్ష పార్టీలు జనసేనాని ముందు కొన్ని డిమాండ్లని పెట్టాయి.
26 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 ఎంపీ స్థానాలు తమ పార్టీలకు కేటాయించాలన్నది వామపక్ష పార్టీల తాజా డిమాండ్. ఇటీవల ఈ విషయమై కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులతో .. విశాఖలో ప్రత్యేకంగా జనసేనాని సమావేశ మయ్యారు. తాజా డిమాండ్ల నేపథ్యంలో మరోసారి తన పార్టీ నాయకులైన నాదేండ్ల మనోహర్తో కలిసి వామపక్ష నేతలతో పవన్ విజయవాడ కార్యాలయంలో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెల్లి విల్సన్, సీపీఎం నుంచి పార్టీ కార్యదర్ఠశి మధు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వామపక్షాలు కోరుతున్న స్థానాల్లో వారికున్న బలమెంత, గతంలో ఆ స్థానాల్లో వారికి వచ్చిన ఓట్లెన్ని?. వారు కోరుతున్న స్థానాల్లో జనసేనకు ఉన్న బలం ఎంత? అన్నింటిని బేరీజు వేసుకుని సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై అవగాహన వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించడం విశేషం.