వైసీపీలో చేరనున్న చల్లా రామకృష్ణారెడ్డి

SMTV Desk 2019-03-08 12:07:43  Challa Ramakrishna Reddy, Chandrababu Naidu, Jaganmohan Reddy, TDP, YCP, Party Changing, Congress, MLA

అమరావతి, మార్చి 8: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు దేశం పార్టీ(టీడీపీ)కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా మరోసారి టీడీపీకి చుక్కెదురైంది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్నీ చల్ల స్వయంగా మీడియాకు తెలిపారు.

కర్నూలు జిల్లాలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన చల్ల, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తరుపున కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుండి పోటి చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్ర విభజన తరువాత ఆయన టీడీపీలో చేరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చల్ల పార్టీని వీడటం టీడీపీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.