లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

SMTV Desk 2019-03-08 12:06:30  Loksabha, congress,

న్యూఢిల్లీ, మార్చ్ 08: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు మంచి ఫామ్ లో ఉన్నాయి ముఖ్యంగా, యువనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 15 మందితో కూడిన ఈ జాబితాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరులేదు. ఇక, రాహుల్ గాంధీ, సోనియా తమకు అచ్చొచ్చిన అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఈ తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది, గుజరాత్ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు.ఈసారి సోనియా కూతురు ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి జాబితాలో సోనియానే ఈ స్థానం నుంచి తిరిగి మరో సారి పోటీకి దిగుతున్నట్లు స్పష్టం అయింది. గత ఐదు దఫాలుగా ఈ స్థానంలో సోనియానే గెలుస్తూ వస్తున్నారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రాహుల్ గాంధీ సారధ్యం వహిస్తున్నారు.