ఈనెల 15 నుండే ఒంటిపూట బడులు...

SMTV Desk 2019-03-08 12:01:16  Government, Half Day Schools, Mid Day Meals, Summer

హైదరాబాద్, మార్చి 8: వేసవి కాలం సమీపిస్తుంది. రోజురోజుకి ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ మండుతున్న ఎండల్లో ప్రజలు మధ్యాహ్నం పూట బయటకి వెళితే ఇక అంతే సంగతి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల కు ఒంటి పూట బడులను అమలు చేయనున్నారు. ఈ నెల 15వ తేది నుండి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్‌ హాలిడేస్‌ అమలు చేయాలని వెల్లడించారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి రోజు అయిన ఏప్రిల్ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత వేసవి సెలవులు వర్తిస్తాయని వివరించారు. పాఠశాలలు తిరిగి జూన్‌ 1న ప్రారంభం కానున్నాయి.