రాంచీ, మార్చ్ 07: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీం ఇండియాకు తన ఇంట్లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ నెల 8న ఆస్ట్రేలియా జట్టుతో రాంచీ వేదికగా భారత్ మూడో వన్డే ఆడనున్నవిషయం తెలిసిందే. అందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లు రాంచీ చేరుకున్నారు. ధోనీ స్వస్థలమైన రాంచీకి కోహ్లీ సేన రావడంతో ధోనీ దంపతులు తమ నివాసంలోనే వారికి ఆతిథ్యం ఇచ్చారు. వారిని తమ ఫాంహౌస్ కి తీసుకెళ్ళి అన్నిరకాల కాంటినెంటల్, స్థానిక వంటకాలతో కొసిరి కొసిరి కడుపునిండా వడ్డించారు. ఎప్పడూ మ్యాచ్లు ప్రాక్టీస్లతో బిజీబిజీగా ఉండే ఆటగాళ్లకు ఆ విందు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ, యుజువేంద్ర చాహల్ తమ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. అద్భుతమైన ఫుడ్ తిన్నాం, ఫుల్గా ఎంజాయ్ చేశాం ..ఈ పార్టీ ఇచ్చినందుకు ధోనీ దంపతులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.