న్యూఢిల్లీ, మార్చ్ 07: బాలాకోట్ ఉగ్రవాదుల స్థావరాలను కూల్చేందుకు ఐఏఎఫ్ జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలను తాజాగా భారతా వాయుసేన కేంద్రానికి సమర్పించింది. దీంతో పాటు జైషే మహ్మద్కు చెందిన మదర్సా ఆయేషా సాదిక్పై బాంబులతో దాడి చేసిన ఆధారాలతో పాటు స్పష్టత ఉన్న కొన్ని ఫొటోలను కూడా సమర్పించింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. బాలాకోట్లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి.