బెంగుళూరు, మార్చ్ 07: కర్ణాటక రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మూడ నమ్మకంతో కొంత మంది సమాధిని తవ్వి శవాన్ని బయటకు తీసి తల నరికి తీసుకుపోయారు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయందోలనకు గురవుతున్నారు. పూర్తి వివరాల ప్రకారం....నెలమంగళ తాలుకా భైరనహళ్లి గ్రామానికి చెందిన అరసయ్య వయసుకు సంబంధించిన అనారోగ్యంతో జనవరి 13న మరణించాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులు గ్రామ శివారులో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని బయటకు తీసి తల కత్తిరించుకుపోయారు. బుధవారం ఉదయం శ్మశానం వైపుగా వెళ్లిన కొందరు స్థానికులకు సమాధి తవ్వి ఉండటం, తల లేని శవాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని నెలమంగళ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబసభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చిపెట్టారు. బుధవారం అమావాస్య కావడంతో క్షుద్రపూజల కోసం కొందరు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.