అమరావతి, మార్చి 7: ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కాంగ్రెస్ తరుపున ప్రచారంలో పాల్గొని, కాంగ్రెస్ కు ఓటు వేయాలని సూచించారు. ఇది తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఆయనను పాటు పార్టీ నుండి బహిష్కరించారు. తాజాగా ఈరోజు శివకుమార్ జగన్ ను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్న శివకుమార్ జగన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. సుమారు 3 నెలల తరువాత శివకుమార్ జగన్ ను కలుసున్నాడు.
తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందన్న భయంతోనే టీడీపీ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. పలు కారణాల వల్ల గత 3 నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు. జగన్ పెద్ద మనసు చేసుకుని తనను వైసీపీలోకి తిరిగి స్వాగతించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు సంక్షోభంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాను జగన్ తో ఈ విషయమై మాట్లాడాననీ, వైసీపీ విజయం కోసం పనిచేస్తానని శివకుమార్ అన్నారు.