హైదరాబాద్, ఆగష్ట్ 6: నేడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన మార్గదర్శకుడిగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సిద్ధాంత కర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగష్టు 6, 1934 వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు.