చెన్నై, మార్చి 5: కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం దక్షిణ తమినాడులో పర్యటించిన ఆయన, 1000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును, 150 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను గోయల్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాంలో గోయల్ మాట్లాడారు. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మొదటి సెమి హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గోయల్ ధ్వజమెత్తారు. వారికి(కాంగ్రెస్) భారత ఇంజనీర్ల ప్రతిభ నచ్చడంలేదని, ఇటలీ నుండి ఇంకా ఎదో కావాలని మండిపడ్డారు. దేశ శ్రామికులు, ఇంజనీర్ల కృషి ఫలితంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ను రూపొందించడం వారు జీర్ణించుకులేకపోతున్నారని విమర్శించారు. భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమేనని గోయల్ అన్నారు. కార్మికులు రాత్రింబవళ్ళు కృషిచేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్ 18పై రాహుల్ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు. భారతదేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల అనుభవంతో టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేయలని భావిస్తున్నామని, కానీ ఇటలీ నుండి దిగుమతి చేసుకోవాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని వ్యంగ్యంగా విమర్శించారు. కాగా తమిళనాడులోని నైవేలిలోని విద్యుత్ ప్లాంట్ కార్మికుల శ్రమను గుర్తించిన కేంద్రమంత్రి నెలజీతంలో రూ.ఎనిమిదివేలు పెంచుతున్నట్లు ప్రకటించారు. శ్రామికుల కష్టాన్ని ఈ దేశం మర్చిపోదనన్నారు.