భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తత...పెళ్లి వాయిదా

SMTV Desk 2019-03-05 12:10:43  pulwama attack, jai-she mohammed, crpf jawan, india, pakistan

రాజస్థాన్, మార్చి 04: భారత్-పాకిస్థాన్ ల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తొలుత జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఉగ్రవాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకోగా, భారత్ పాక్ లోని జైషే స్థావరంలో ఉన్న 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా, భారత్-పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు దిగజారడంతో ఓ యువ జంట పెళ్లి కూడా ఆగిపోయింది.

రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్ కు పాక్ లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన చగన్ కర్వార్ అనే యువతికి ఈ నెల 8న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తిచేసేశారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీసాలు కూడా తీసేసుకున్నారు. అయితే అంతలోనే అనుకోకుండా పుల్వామా ఉగ్రదాడితో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

దీంతో పెళ్లిని వాయిదా వేసుకోవాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ విషయమై వరుడు మహేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.."పెళ్లికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశాం. కార్డులు పంచడంతో పాటు వీసాలు కూడా తీసేసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగోలేనందున పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించాం. ఇరుదేశాల మధ్య పరిస్థితి చక్కబడ్డాక వివాహం చేసుకుంటాం" అని తెలిపారు.