చెన్నై, మార్చి 4: విమానాలను హైజాక్ చేయనున్నామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తరువాత, భారత వాయుసేన దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై సర్జికల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాలను హైజాక్ చేయనున్నామని పలు ప్రాంతాల్లో బెదిరింపులు రాగా, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు.
ఓ ప్రత్యేక ప్రకటనను పౌరవిమానయాన శాఖ విడుదల చేస్తూ, భద్రతను పెంచాలని, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే ప్రయాణికులను ఎయిర్ పోర్టులోకి పంపాలని ఆదేశించింది. అలాగే, సందర్శకుల అనుమతిని కూడా రద్దు చేసింది. చెన్నైతో పాటు హైదరాబాద్, కొచ్చిన్, కోయంబత్తూర్, విజయవాడ, బెంగళూరు తదితర దక్షిణ రాష్ట్రాల ఎయిర్ పోర్టులలో భద్రతను పెంచారు.